ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. తెలంగాణా రాష్ట్రం ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది.
సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు,కాలం గడిచే కొద్దీ జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి. ఈ గద్దేలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణేలను తీసుకు వస్తారు.పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు
13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతములోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేసారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. మేడారాన్ని పాలించే కోయరాజు “పగిడిద్దరాజు” కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, తిరుగుబాటుదారులకు ఆశ్రయం కల్పించడం వంటి కారణాలతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు మేడారం పై దండెత్తుతాడు.
పగిడిద్దరాజు,సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధం చేస్తారు. కాని కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. ఓటమి అవమానం తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుండి సంపెంగవాగు నే ప్రజలు జంపన్న వాగుగా పిలుస్తున్నారు
గిరిజన మహిళ సమ్మక్క యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోయాడు. శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క గాయాలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
కొద్దిపాటి మార్పులతో ఇటువంటి కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. జంపన్న ఆత్మహత్య చేసుకోవడం అబద్ధమని, అతను తన నెత్తుటి గాయాలను వాగులో శుభ్రం చేసుకున్నాడు కనుక దానికి జంపన్న వాగు అని పేరొచ్చిందనీ ఒక కథనం. అయితే, సమ్మక్క, జంపన్న వంటి కోయవీరులు మరణించారని అంగీకరించడానికి ఆదివాసీలెవరూ సిద్ధంగా లేరు. వారింకా బతికే ఉన్నారని, సమ్మక్క భరిణె రూపంలో ప్రతీ రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందని వారి విశ్వాసం.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3bigJbI
Comments
Post a Comment