సూపర్ స్టార్ మహేష్ బాబు గత నాలుగైదు చిత్రాల నుండి వరసగా సినిమాలు చేస్తున్నాడు. షూటింగ్ ల మధ్యలో బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తున్నాడు కానీ సినిమా పూర్తైన కొన్ని రోజులకే మరొకటి మొదలుపెట్టేస్తున్నాడు. అయితే ఈసారి నాలుగైదు నెలలు బ్రేక్ తీసుకుందామని మహేష్ నిర్ణయించుకున్నాడట. మహేష్ బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. మరొక షెడ్యూల్ కంప్లీట్ చేస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నవంబర్ కల్లా చిత్ర షూటింగ్ ను పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేసింది.
సో నవంబర్ తర్వాత నుండి మహేష్ బాబు ఫ్రీ అవ్వనున్నాడు. అయినా కానీ మహేష్ తన తదుపరి సినిమా విషయంలో తొందరపడట్లేదు. నాలుగైదు నెలలు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే తనకు కథలు వినిపించిన దర్శకులు ఎవరూ ప్రస్తుతం ఫ్రీ గా లేరు. ఇప్పుడు కొత్త కథ విన్నా కానీ దాన్ని డెవలప్ చేయడానికి కొన్ని నెలల సమయం కావాలి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మహేష్ విరామం తీసుకుంటున్నాడు.
మహేష్ కు కథలు వినిపించిన వాళ్లలో సందీప్ రెడ్డి, ప్రశాంత్ నీల్ ఉన్నారు. సందీప్ రెడ్డి బాలీవుడ్ లో క్రైమ్ థ్రిల్లర్ చేయడానికి రెడీ అవుతుండగా, ప్రశాంత్ నీల్ ఇంకా కేజిఎఫ్ నుండి బయటకు రావడానికి 6 నెలల సమయం పడుతుంది. వంశీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ కు నచ్చింది కానీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి నాలుగు నెలలైనా కావాలి అంటున్నాడు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ చేస్తున్న అనిల్ రావిపూడి కూడా మహేష్ కు ఒక లైన్ చెప్పాడు కానీ సరిలేరు నీకెవ్వరు విడుదలయ్యాక కానీ కొత్త స్క్రిప్ట్ మీద కూర్చోలేడు అనిల్. ఇలా అందరూ బిజీగా ఉండడంతో మహేష్ కు గ్యాప్ తీసుకోక తప్పడంలేదు. ఇన్నాళ్లూ ఒక సినిమా పూర్తయ్యేలోపే మరో సినిమా ప్రకటించిన మహేష్, ఈసారి బ్రేక్ తీసుకుని ఎలాంటి కథతో వస్తాడో, ఎవరి దర్శకత్వంలో కథ చేయనున్నాడో అన్నది ఆసక్తికరంగా మారింది.
సరిలేరు నీకెవ్వరు చిత్రంపై మహేష్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. దూకుడు తర్వాత పూర్తి స్థాయిలో కామెడీ చేస్తున్న చిత్రం కావడంతో మహేష్ ఈ చిత్రం గురి తప్పదని భావిస్తున్నాడు. ఈ మధ్య అతి మంచోడి పాత్రలు ఎక్కువగా చేసి ఫ్యాన్స్ కు కూడా బోర్ తెప్పించేసిన మహేష్ ఈసారి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ద్వారా రానున్నాడు. సంక్రాంతికి విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తమన్నా ఒక ప్రత్యేక గీతంలో నర్తించనుంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత విజయశాంతి ఈ చిత్రం ద్వారా తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనుంది. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు థియేటర్లలో సందడి చేయనుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BCCy5a
Comments
Post a Comment